ఈ సమయము లో మా పూర్వీకులను తలుచుకొని వారికి నా హృదయ పూర్వక నమస్కారములు సమర్పించు కోవటము నా కనీస కర్తవ్యము అనిపిస్తుతోంది. పెద్దలు చేసిందే పిల్లలకు వస్తుంది అని మన అందరికి తెలిసినదే! మా తాత గారి తాత గారు , తరువాత మా తాత గారి నాన్న గారి తరములలో మా ఇంట్లో యజ్ఞ, యాగాదులు జరిగేవి. తరువాత మా తాత గారు యజ్ఞ యాగాదులు చేయలేదు, కానీ ఆయన ఎక్కువ సమయము కళ్ళు మూసుకొని ఒక ప్రక్కన కూర్చొని ఉండే వారని మా అమ్మ గారు చెప్పిన విషయము. ఇంకొక విషయము తెలిసినది ఏమనగా మా తాత గారిని ఎవరైనా చుట్టుపక్కల పిల్లలు తాత గారు ఇవి కావాలి తెచ్చిపెట్టరా అని అడిగితే వీళ్ళు పిల్లలు వాళ్ళు అడిగితే మనము తేవాలా అని అనుకోకుండా వాళ్ళకు తెచ్చి ఇచ్చే వారని మా అమ్మ గారి ద్వారా విన్నాను. మా అమ్మ గారి నాన్న గారు మంచి ఆధ్యాత్మికత ఉన్న వారు. ఆయన దగ్గఱ మంచి చనువు నాకు ఉండేది. అయన కూడా మంచి విషయములు చెప్పేవారు. మా అమ్మ గారు చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని వస్తావట్టిదే పోతావట్టిదే మొదలైన తత్వ గీతాలను పాడి వినిపిస్తూ పెంచారు . మా ఇంట్లో మా నాన్న గారు కూడా ప్రొద్దున్నే లేచి గాయత్రీ జపము చేసుకొన్న తరువాతే గాని కాఫీ తీసుకొనే వారు కాదు. మా నాన్న గారు కూడా ఉపాధ్యాయ వృత్తి లో ఉండి అయన పనేదో ఆయనది గాని ఎక్కువ ఎవరి తోనూ అనవసరముగా మాట్లాడటము నేను చూసింది లేదు. ఈ రకమైన వాతావరణములో నేను పెరిగిన వాడిని. ఉపాసన గురుంచి మా గురువు గారు చెప్పినా అది ఎలా చేయాలో చెప్ప కుండా నీ పాట్లు నీవే పడు అని అన్నారు. అప్పటికి ముందు అనుకొన్న విధముగా రకరకాల ఇబ్బందికర పరిస్థితుల లో ఉండి మా నాన్న గారిలా గాయత్రీ (రోజూ సహస్రము) చేస్తుండే వాడిని. ఆ సమయములో షిరిడి సాయి బాబా సచ్చరిత్ర మాతా కృష్ణ కుమారి (రామచంద్రాపురము) వ్రాసినది దొరుకుతే అది పారాయణము చేస్తూ ఉండే వాడిని.
No comments:
Post a Comment